ఆంధ్రా పోరీ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ. ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మెహబూబా అనే సినిమా చేశాడు. ఇండియా-పాకిస్తాన్ ప్రేమ కథతో తెరకెక్కిన మెహబూబా అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. దాంతో ఆకాష్ కెరీర్ అక్కడే ఆగిపోయింది. మూడేళ్ల తర్వాత రొమాంటిక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు కథ మాటలు స్క్రీన్ ప్లే పూరి జగన్నాథ్ అందిస్తున్నాడు. ఆయన శిష్యుడు అనిల్ పడూరీ రొమాంటిక్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
2019 లోనే సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా కరోనా వలన కొద్ది రోజులు వాయిదా పడింది. లాక్డౌన్ తర్వాత మిగతా చిత్ర షూటింగ్ను పూర్తి చేసి జూన్ 18న థియేటర్స్లోకి ఈ సినిమాను తీసుకురాబోతున్నారు. కొద్ది సేపటి క్రితం రొమాంటిక్ పోస్టర్ విడుదల చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇందులో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఒక బీచ్ సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా పోస్టర్స్ పై విమర్శలు కూడా వచ్చాయి. మహిళా సంఘాలు గోల గోల చేశారు. ఈ సినిమాతో హిట్ కొట్టాలని ఆకాశ్ ఆశగా ఎదురు చూస్తున్నాడు.