నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం టైటిల్ ఖరారైంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం టీజర్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో సినిమా టైటిల్ ను 'అఖండ' గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో 'కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది' అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. మరో నటి పూర్ణ డాక్టర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సింహా’ , ‘లెజెండ్’ తర్వాత బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానులతో పాటు టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.