నితిన్ చాలా కాలం తర్వాత గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘భీష్మ’తో సూపర్ హిట్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇక నితిన్ కథానాయకుడిగా చంద్ర శేఖర్ ఏలేటి తెరకెక్కించిన `చెక్` ఫిబ్రవరి 26న విడుదలైంది. మరణశిక్షను ఎదుర్కొంటున్న ఖైదీ ఆదిత్య పాత్రలో నితిన్ నటించారు. చెక్ నిజ సంఘటనల ఆధారంగా రాసుకున్న స్క్రిప్ట్. జైలు శిక్ష సమయంలో చెస్ ఆడిన ఒక అమెరికన్ ఖైదీ కథ అని దర్శకుడు వెల్లడించారు. జైలు నేపథ్యంలో ప్రయోగాత్మక చిత్రమిది. ప్రయోగాలు చేయడంలో.. టెక్నికల్ గా ఉన్నతంగా సినిమాలు తీయడంలో ఏలేటి చాలా అనుభవజ్ఞుడు కాబట్టి ఈ సినిమా చేస్తున్నానని నితిన్ తెలిపారు.
ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ పాత్రలో నటించగా.. రెండవ కథానాయికగా ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది. కల్యాణ్ మాలిక్ సంగీతం సమకూర్చారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్ని అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. మే 14 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఆదరించలేదు. కనీసం ఓటీటీల్లో అయినా చెక్ హిట్టవుతుందేమో చూడాలి. అలాగే నితిన్ - కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన 'రంగ్ దే' పెద్ద తెరపై చక్కని వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమా మే 21 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. రంగ్ దే ఓటీటీ ఆదరణ ఎలా ఉండనుందో వేచి చూడాలి.