-`నీదీ నాదీ ఒకే కథ' కథానాయకుడు శ్రీవిష్ణు
`అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో' చిత్రాలతో విజయాలు సాధించి తాజాగా `నీదీ నాదీ ఒకే కథ'తో హీరోగా హ్యాట్రిక్ కొట్టేందుకు వస్తున్నాడు శ్రీవిష్ణు. వేణు ఊడుగుల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర కథానాయకుడు శ్రీవిష్ణు మీడియాతో ముచ్చటించారు!
గ్రామీణ నేపథ్యంలో ఓ బిలో మిడిల్ క్లాస్ అబ్బాయిగా నటించిన చిత్రం `నీదీ నాదీ ఒకే కథ'. ఇందులో నేను చేసిన క్యారక్టర్ తో కుర్రాళ్లంతా కనెక్ట్ అయితే.. నా ఫాథర్ రోల్ తో పెద్దవాళ్లంతా కనెక్ట్ అవుతారు. ప్రముఖ దర్శకులు దేవీప్రసాద్ గారు ఈ క్యారక్టట్ చేశారు. మొదట్లో ఎలా చేస్తారో అనుకున్నాం. కానీ ఆయన పూర్తి న్యాయం చేశారు. ఇక ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న వేణు ఊడుగుల ప్రతి ఫ్రేమ్ చాలా చక్కగా మలిచాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అతనేంటన్నది అందరికీ తెలుస్తుంది. సన్నివేశాలన్నీ చాలా సహజసిద్ధంగా ఉంటాయి. చిన్న చిత్రాల్లో ఇదొక చిన్న ట్రెండ్ సెట్టర్ అవుతుందనే నమ్మకముంది. హీరోయిన్ గా చేసిన శాంటా టైటస్ చాలా బాగా చేసింది. సురేష్ బొబ్బిలి ట్యూన్ చేసిన పాటలకు మేమూహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తోంది. హీరోగానే చేయాలనే నియమమేమీ నేను పెట్టుకోలేదు. నాకు నచ్చితే యెంత చిన్న క్యారక్టర్ అయినా చేస్తాను. `ఉన్నది ఒక్కటే జిందగీ'లో నేను చేసిన క్యారక్టర్ ని నేను చాలా లవ్ చేశాను. ఇప్పుడు `వీరభోగవసంత రాయలు' లో నారా రోహిత్, సుధీర్, శ్రియలతో కలిసి నేను కూడా ఒక క్యారక్టర్ చేస్తున్నాను. ఇది కాకుండా నేను చేస్తున్న మరో సినిమా `తిప్పరా మీసం'. ఈ జెనరేషన్ హీరోల్లో దుల్కర్ సల్మాన్, రాజకుమార్ రావు (బాలీవుడ్) ఇష్టం. కథ, కథనాల పరంగా పెద్దగా ప్రయోగాలు చేయకుండా సాంకేతికంగా ప్రయోగాలు చేస్తూ సినిమాలు చేయాలన్నది నా కోరిక!!