సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానంతరం తన పరువుకు భంగం కలిగించేలా కంగనా రనౌత్ ఓ టీవీ ఇంటర్య్వూలో వ్యాఖ్యలు చేశారని గతేడాది నవంబర్లో రచయిత జావేద్ అక్తర్ ఆమెపై పరువునష్టం దావా వేశారు. దీనిని కొట్టివేయాలని ముంబై హైకోర్టులో కంగనా పిటీషన్ దాఖలు చేశారు. దానిని కోర్టు తోసిపుచ్చింది. మంగళవారం ముంబై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పరువునష్టం దావా కేసు విచారణకు వచ్చినప్పుడు... కంగనా రనౌత్కి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆమె న్యాయవాది కోరారు. 'తలైవి' ప్రచార కార్యక్రమాల నిమిత్తం ప్రయాణాలు చేయడంతో ఆమెలో కొవిడ్-19 లక్షణాలు కనిపించాయని కోర్టుకు వివరించారు. దాంతో ఈ ఒక్కసారి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. కేసు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తూ... ఆ రోజు కంగనా రనౌత్ కోర్టుకు హాజరు కాకపోతే ఆమెపై వారెంట్ ఇష్యూ చేస్తామని న్యాయమూర్తి ఆర్ఆర్ ఖాన్ తీర్పునిచ్చారు.