సందీప్ కిషన్, నేహాశెట్టి, బాబీ సింహా, హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన 'గల్లీ రౌడీ' సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు రామ్ మిర్యాల, సాయి కార్తీక్ సంగీతం అందించారు. కోనవెంకట్ నిర్మాణంలో జి.నాగేశ్వర్రెడ్డి తెరకెక్కించారు. కథలోకి వెళ్తే.. విశాఖలో ఒకప్పుడు పేరు మోసిన రౌడీ సింహాచలం(నాగినీడు) తన కొడుకు మరణించాక ఎలాగైనా తన మనవడు వాసు (సందీప్ కిషన్)ని రౌడీని చేయాలనుకుంటాడు. తన శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా పెంచుతాడు. వాసుకి రౌడీయిజం అంటే ఇష్టం ఉండదు. సాహిత్య (నేహాశెట్టి)ను ప్రేమిస్తాడు. సాహిత్యకు, ఆమె కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. అందుకోసం 'గల్లీరౌడీ'గా చలామణీ అవుతున్న వాసుని ఆశ్రయిస్తుంది. ఇంతకీ సాహిత్య కుటుంబానికి వచ్చిన సమస్య ఏమిటి? అందుకోసం వాసు ఏం చేశాడు? రౌడీ అయ్యి, శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలన్న తాత కోరికని ఎలా నెరవేర్చాడన్నదే కథ. ఈ కథలో కొత్తదనం లేదు. నవ్వించడమే ప్రధాన లక్ష్యంగా తెరకెక్కించినట్లు అనిపిస్తుంది. లాజిక్ లేని సన్నివేశాలతో సినిమా నీరసంగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కిడ్నాప్ డ్రామా ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్స్ మెప్పిస్తాయి. సెకండ్ హాఫ్ లో రవినాయక్గా బాబీ సింహా ఎంట్రీ ఇచ్చాక కూడా కథలో సీరియస్నెస్ కనిపించదు. ఆ పాత్రని పరిచయం చేసిన విధానం ఓ రేంజ్లో ఉంటుంది కానీ, ఆ ప్రభావం ఆ తర్వాత కనిపించదు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, షకలక శంకర్ లు కనిపించిన సీన్లే అక్కడక్కడా నవ్వించాయి.