నటుడు సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు శనివారం ఆదాయపన్ను(ఐటీ) విభాగం వెల్లడించింది. సోనూ సూద్ ఇళ్లు, కార్యాలయాల్లో వరుసగా 3 రోజుల పాటు ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐటీ విభాగం సోనూసూద్ సుమారు రూ.20 కోట్ల మేర ఆదాయపన్నును ఎగవేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. సోనూసూద్ కు చెందిన నాన్ ప్రాఫిట్ సంస్థ ఫారిన్ కాంట్రిబ్యూషన్ చట్టాన్ని ఉల్లంఘించి సుమారు రూ.2.1 కోట్లు సమీకరించినట్లు ఐటీశాఖ చెప్పింది. తనిఖీల్లో పన్ను ఎగవేతకు చెందిన అనేక పత్రాలు దొరికినట్లు ఐటీశాఖ తెలిపింది. అంతేకాకుండా సోనూసూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్( రెగ్యులేషన్) యాక్ట్ ను ఉల్లంఘించారని ఐటీ అధికారులు పేర్కొన్నారు. దానికింద క్రౌడ్ ఫండింగ్ ద్వారా విదేశీ దాతల నుంచి రూ.2.1 కోట్లను సేకరించినట్లు తెలిపారు. సోనూసూద్ కరోనా కష్టకాలంలో ఎంతో మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. అయితే ఇటీవల విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే ఉద్దేశంతో రూపొందించిన కార్యక్రమానికి ఢిల్లీ ప్రభుత్వం సోనూసూద్ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ సోదాలు జరపడంపై ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది.