బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ప్రారంభమై రెండు వారాలు పూర్తయ్యాయి. శనివారం ఎపిసోడ్ లో హీరో రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చారు. బిగ్ బాస్ స్ట్రీమ్ అవుతున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అయితే 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్-5 కార్యక్రమంలో తొలివారం సరయు ఎలిమినేట్ అయ్యింది. ఇక రెండో వారం నామినేషన్ లో కాజల్, లోబో, ప్రియాంక సింగ్, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్ ఉండగా శనివారం రోజు లోబో, అనీ మాస్టర్, ప్రియాంక సింగ్ లు సేవ్ అయ్యారు. మిగతా ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజా సమాచారం మేరకు కార్తీక దీపం ఫేమ్ ఉమా దేవి ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. ఉమా దేవికి అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు. మొదట్లో అందరిపై అరిచేసి నానా రచ్చ చేసిన ఉమాదేవి ఈ మధ్య లోబోతో కలిసి తెగ నవ్విస్తుంది. అయితే ఆమె మాట్లాడిన కొన్ని అసభ్య పదాలు ఆమెకు కొంత నెగెటివిటీని తెచ్చి పెట్టింది. ఆ మధ్య ప్రియాంకపై నోరు పారేసుకోవడం కూడా ఉమా దేవి ఎలిమినేట్ కు కారణం అయ్యాయని అంటున్నారు. ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్ లో బిగ్ బాస్ నుండి ఎవరు ఎలిమినేట్ కానున్నారనేది తెలుస్తుంది.