వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసినా వార్తే. వర్తమాన అంశాలపై సినిమాలు తీస్తూ వివాదాలు రాజేసి చలికాచుకునే వర్మ ఈ మధ్య తెలుగురాష్ట్రాల్లో ఏదీ జరిగినా స్పందిస్తూ కాకరేపుతున్నాడు. వర్మ ఏది చేసినా సంచలనమే.. వెండితెరపై సినిమా తీసినా.. ఓటీటీలో వెబ్ సిరీస్ రూపొందించినా ఆయన స్టైలే వేరు. ఇంకా బయోపిక్ సినిమాల నిర్మాణంలో రాంగోపాల్ వర్మ టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే..
ఇప్పటికే రక్త చరిత్ర కడపరెడ్లు చంద్రబాబు వెన్నుపోటుపై ఎన్నో సినిమాలు తీసిన వర్మ ప్రస్తుతం తెలంగాణ ఫైర్ బ్రాండ్ దంపతులు కొండా సురేఖ దంపతులపై సినిమా రూపొందిస్తున్నారు... ఈ నేపథ్యంలోనే గత రెండు రోజుల నుంచి రాంగోపాల్ వర్మ నెక్ట్స్ మూవీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై వర్మ 'ఈటల వెన్నుపోటు' సినిమా తీయబోతున్నాడని ఒక ట్వీట్ హల్ చల్ చేస్తోంది. సీఎం కేసీఆర్ కు ఈటల వెన్ను పోటు పొడిచాడని.. దీనిపైౌ వర్మ సినిమా తీస్తున్నారని ఆయన పేరుతో ఓ పోస్టు చక్కర్లు కొడుతోంది.
'వెన్నుపోటు ఈటలు' అంటూ టైటిల్ కూడా రాంగోపాల్ వర్మ ఫిక్స్ చేసినట్లుగా జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ సోషల్ మీడియా వైరల్ వార్త వర్మకు తెలియడంతో దాన్ని ట్వీట్ చేసిన వర్మ క్లారిటీ ఇచ్చాడు... 'తన పేరుతో కొందరు అకౌంట్ క్రియేట్ చేసి ఆ పోస్టర్ ను వదిలారని.. తాను ఈటల రాజేందర్ ఎపిసోడ్ పై ఎలాంటి సినిమాలు చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యేది ఫేక్ వార్త అంటూ స్పష్టం చేశారు.