నటనలో గోపిచంద్ ది ప్రత్యేక రూట్. ఆయన విలన్ గా కెరీర్ ప్రారంభించి హీరో అయ్యారు. మళ్లీ ఆయన విలన్ గా మారుతున్నారన్న ప్రచారం ఊపందుకొంది. టాలీవుడ్ లో ఒకప్పుడు ముందుగా విలన్ పాత్రల్లో మెప్పించి, ఆ తరువాత హీరోగా మారిపోయి స్టార్ డమ్ ను అందుకున్నవారున్నారు. ఇక ఇప్పుడు హీరోలుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నవారిలో చాలామంది విలన్ వేషాలను వేయడానికి ఎంతమాత్రం వెనుకాడటం లేదు. ఆ జాబితాలో తాజాగా గోపీచంద్ పేరు కూడా వినిపిస్తోంది. గోపీచంద్ తన కెరియర్ తొలినాళ్లలో విలన్ వేషాలతో మెప్పించాడు. ఆ తరువాత యాక్షన్ హీరోగా తన సత్తా చాటుకుని, ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నాడు. అలాంటి గోపీచంద్ మళ్లీ పవర్ఫుల్ విలన్ గా కనిపించనున్నాడని అంటున్నారు .. అదీ రాజమౌళి సినిమాలో. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం గోపీచంద్ ను సంప్రదిస్తున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. గతంలో మహేశ్ 'నిజం' సినిమాలో గోపీచంద్ విలన్ గా చేశాడు. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ కలవనుందని అంటున్నారు. అయితే ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.