కోలీవుడ్ స్టార్ హీరో శింబు తండ్రి, డైరెక్టర్ టి. రాజేందర్ నిన్న ఆకస్మిక గుండె నొప్పితో ఆసుపత్రి పాలయ్యారు. దీంతో కోలీవుడ్లో, మీడియాలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఆయన ఆరోగ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో శింబు స్పందించారు. తండ్రి ఆరోగ్యంపై అభిమానులకు సమాచారాన్ని, వివరణను ఇవ్వాలనే నెపంతో సోషల్ మీడియా వేదికగా ఒక అఫీషియల్ నోట్ ను విడుదల చేసారు. చిన్నపాటి గుండెనొప్పికి గురైన రాజేందర్ ను కుటుంబసభ్యులు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. మెడికల్ చెకప్ లో భాగంగా ఆయన కడుపులో రక్త స్రావాన్ని డాక్టర్లు గుర్తించారని, ఇందుకోసం మెరుగైన చికిత్స అవసరమని డాక్టర్లు సూచించారని శింబు తెలిపారు. చికిత్స కోసం త్వరలోనే రాజేందర్ విదేశాలకు వెళ్లనున్నారని, చికిత్స అనంతరం అభిమానులను పలకరించడానికి మీడియా ముందుకు వస్తారని శింబు పేర్కొన్నారు. తన తండ్రి ఆరోగ్యంగా ఉండాలని, ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి శింబు కృతజ్ఞతలను తెలియచేసారు.