ఇటీవల దేశవ్యాప్త ప్రభంజనం సృష్టించిన సినిమాలలో కేజీఎఫ్ 2 ఒకటి. దేశవిదేశాల్లో కాసులపంట పండిస్తున్న కేజీఎఫ్ ను భారీ బడ్జెట్టుతో ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. కేజీఎఫ్ కు పనిచేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్, టెక్నికల్ టీం మొత్తం ప్రస్తుతం ప్రభాస్ ను సలార్ గా తీర్చిదిద్దడంలో చాలా బిజీగా ఉన్నారు. నిర్మాత విజయ్ కిరంగదుర్ ఒక్కరే పలు మీడియా ఛానెల్స్ కు, వార్తా పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తూ కేజీఎఫ్ బజ్ ను ఇంకా కొనసాగిస్తున్నారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కేజీఎఫ్ ఫ్రాంచైజీతో దేశం దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించిన ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రాలకి భారీ లైనప్ ను సిద్ధం చేసుకున్నాడని వినికిడి. ఈ నేపథ్యంలో తారక్ తో సినిమాను ఎప్పుడు చేస్తారని నందమూరి అభిమానులు టెన్షన్ పడుతున్నారు. సలార్ మూవీకి సంబంధించిన అన్ని పనులు ముగిసిన తర్వాతనే ప్రశాంత్ ఎన్టీఆర్ 31 మూవీని ప్రారంభిస్తారని విజయ్ క్లారిటీ ఇచ్చేసారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 31 సినిమా కథను పూర్తి తరహాలో సిద్ధం చెయ్యటానికి ప్రశాంత్ నాయకత్వంలోని కొందరు రచయితల బృందం పని చేస్తున్నారని విజయ్ చెప్పారు. ఈ క్రమంలో ప్రశాంత్ సలార్ ను, తారక్ ఎన్టీఆర్30 ను పూర్తి చేసి ఎన్టీఆర్ 31 కోసం రెడీ అవుతారని చెప్పారు. ఒకవేళ సలార్ అనుకోని కారణాల వల్ల అంటే లాక్ డౌన్, బడ్జెట్, కాల్షీట్లు, విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఆలస్యమైతే, ఆ సమయంలో ప్రశాంత్ ఎన్టీఆర్ 31 సినిమాను వెంటనే స్టార్ట్ చేసే అవకాశాలున్నాయని విజయ్ వెల్లడించారు.