ప్లానింగ్ లేకపోతే ఒక్కోసారి సూపర్ హిట్ సినిమాలు చేజారిపోతుంటాయి. హీరోలకే కాదు, హీరోయిన్ల విషయంలో కూడా ఇది జరుగుతుంటుంది. తాజాగా లావణ్య త్రిపాఠి కూడా ఓ సూపర్ హిట్ సినిమాను మిస్ అయింది. అదే గీతగోవిందం. అవును.. గీతగోవిందం సినిమాలో లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆమెతో ఫొటోషూట్ కూడా పూర్తిచేశారు. కానీ ఆఖరి నిమిషంలో ఆమె తప్పుకోవడంతో, ఆ స్థానంలో రష్మికను తీసుకున్నారు. అలా గీతగోవిందం లాంటి సూపర్ హిట్ ను మిస్ చేసుకుంది లావణ్య.
ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు పరశురాం బయటపెట్టాడు. లావణ్య త్రిపాఠితో పాటు అను ఎమ్మాన్యుయేల్ పేరును కూడా పరిశీలించామని, అను ముందుగానే నో చెప్పగా, లావణ్య మాత్రం ఆఖరి నిమిషంలో తప్పుకుందని అన్నాడు పరశురాం. అప్పటికే ఒప్పుకున్న ఓ తమిళ సినిమా కారణంగా లావణ్య తప్పుకున్నట్టు తెలిపాడు. మరోవైపు అను ఎమ్మాన్యుయేల్ మాత్రం కథ బాగా నచ్చడంతో, సినిమాను వదులుకోవడం ఇష్టంలేక స్టార్టింగ్ లో వచ్చిన చిన్న సీన్ లో నటించిందని తెలిపాడు. మొత్తమ్మీద లావణ్య త్రిపాఠి ఓ హిట్ సినిమాను మిస్ అయింది. గతంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమాలో కూడా ఇలానే ఛాన్స్ మిస్ చేసుకుంది లావణ్య. అది కూడా హిట్ సినిమానే.