సీనియర్ నటుడు నందమూరి హరికృష్ణ అకాల మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ పలువురు సెలబ్రెటీలు ట్వీట్స్ చేశారు. హరికృష్ణ అకాలమరణం తనను ఎంత కృంగదీసిందని నేచురల్ స్టార్ నానీ తన సంతాపసందేశంలో పేర్కొన్నాడు.. ఇక హీరో మంచు మనోజ్ కూడా హరికృష్ణ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశాడు. అయితే అదే సమయంలో మీడియాకు మనోజ్ ఒ క అభ్యర్థన చేశాడు. హరికృష్ణ మరణానికి సంబంధించిన రోడ్డు ప్రమాద దృశ్యాలను ప్రసారం చేయవద్దని కోరాడు. అలా ప్రసారం చేయడం వల్ల ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు మరింత కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయనకు తగిన గౌరవాన్ని ఇవ్వాలని మీడియాని కోరుతూ.. తన వినతిని మన్నిస్తారని ఆశిస్తున్నానని ట్వీట్ చేశాడు. అలాగే హరికృష్ణ మరణానికి సంతాప సూచకంగా మనోజ్ తన ట్విట్టర్ ఫ్రొఫైల్లో హరికృష్ణ ఫోటోను ఉంచారు.