కథానాయకుల్లా ఒక పరిశ్రమకు పరిమితం కాకపోవడం నాయికలకున్న అతిపెద్ద సౌకర్యం. ప్రాంతీయ భాషల్లో ఒకచోట పేరు తగ్గితే..మరోచోట అవకాశాలు వెతుక్కుంటారు. దక్షిణాది నాయికలంతా ఈ తరహానే. వారిలో తాజాగా చేరింది రాశీ ఖన్నా. ఆమె కొత్త చిత్రం శ్రీనివాస కళ్యాణం బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. అంతకముందున్న తొలిప్రేమ విజయం కన్నా కొత్త సినిమా పరాజయమే ఈ సుందరిపై ప్రభావం చూపించింది. దీంతో తెలుగు అవకాశాలు తగ్గగా…తమిళంపై దృష్టి సారించింది. నయనతారతో కలిసి ఇమైక నోడిగల్, సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న సైతాన్ కా బచ్చా చిత్రాలు చిత్రీకరణలో ఉండగానే మరో మూడు సినిమాలు చేజిక్కించుకుంది. వీటిలో విశాల్ హీరోగా నటిస్తున్న టెంపర్ రీమేక్ కూడా ఉంది. ఇలా టాలీవుడ్లో పేరు తగ్గగానే కోలీవుడ్లో జోరు పెంచిందీ భామ. ఈ సందర్భంగా స్పందిస్తూ…నటిగా నాకు భాషా హద్దులు లేవని భావిస్తా. ఎక్కడైనా మంచి సినిమాల్లో భాగమవ్వాలని కోరుకుంటా. అందమే కాదు నటించే ఆస్కారమున్న పాత్రలూ కావాలి. మలయాళ విలన్ చిత్రంలో మంచి పాత్రను చేశాను. తమిళంలోనూ అలాంటి అవకాశాలు వస్తున్నాయి. అని చెప్పింది.