తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కో సమయంలో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ‘సమరసింహారెడ్డి’ రికార్డులు తిరగరాయడంతో అప్పట్లో సీమ ట్రెండ్ నడిచింది. సీమ బ్యాక్డ్రాప్లో లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. ఆ తరవాత ఇటీవల కాలంలో హారర్ కామెడీ ట్రెండ్ నడిచింది. నవ్విస్తూ భయపెట్టే సినిమాలు చాలానే వచ్చాయి. ఇప్పుడు బోల్డ్ ప్రేమకథా చిత్రాల టైమొచ్చింది. ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ఎక్స్100’ సినిమాలు టాలీవుడ్లో కొత్త ట్రెండ్ను సెట్ చేశాయి. ఇప్పుడు ఇలాంటి బోల్డ్ స్టఫ్తో వరసపెట్టి సినిమాలు వస్తున్నాయి.
ఇటీవలే ‘రథం’ సినిమా ట్రైలర్ వచ్చింది. దీన్ని చూసిన ప్రేక్షకులు ‘ఆర్స్ఎక్స్100’ని మించిపోయింది అన్నారు. ఇప్పుడు దాన్ని తలదన్నే టీజర్ ఒకటొచ్చింది. అదే ‘నాటకం’ టీజర్. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శంఖ్ చక్ర క్రియేషన్స్ పతాకంపై వస్తోన్న చిత్రం ‘నాటకం’. ఆశిష్ గాంధీ, ఆషిమా హీరోహీరోయిన్లుగా నటించారు. కళ్యాణ్ జి.గోగణ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర టీజర్ను తాజాగా విడుదల చేశారు.
టీజర్ చూస్తుంటే ఇది పల్లెటూరు వాతావరణంలో వస్తోన్న మరో బోల్డ్ ప్రేమకథా చిత్రం అని అర్థమైపోతోంది. కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ‘ఆర్స్ఎక్స్100’ను మించి ఉన్నాయి. ‘ఒక్కసారి తప్పు జరిగితే ఇక ఎన్నిసార్లు జరిగినా తప్పు కాదు’ వంటి డైలాగులు ఆకట్టుకున్నాయి. అయితే హీరోహీరోయిన్ల పాత్రలను చూస్తుంటే తమిళ చిత్రాలు గుర్తొస్తున్నాయి. బాల కోటేశ్వరరావు, పార్వతి అనే గ్రామీణ జంట మధ్య జరిగే ప్రేమకథ ఈ చిత్రం. రొమాన్స్, యాక్షన్, ఎమోషన్స్ ఇలా అన్నీ రకాల ఎలిమెంట్స్ను కలగలిపి ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈనెలాఖరులో ‘నాటకం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.