ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకెళుతున్న సమంత ప్రస్తుతం యూటర్న్, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలతో బిజీగా ఉంది. ఈ సినిమాల తర్వాత సామ్ కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. కాని తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం తర్వాత బన్నీ ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తాడని ఊహాగానాలు రాగా చివరికి మనం, 24 వంటి అద్భుత చిత్రాలు తెరకెక్కించిన విక్రమ్ కుమార్ డైరెక్షన్లో చేయనున్నాడని తెలుస్తుంది. హలోతో ఫెయిల్యూర్ ఎదుర్కొన్న విక్రమ్ కుమార్ తర్వాతి ప్రాజెక్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించనున్నాడు. సమంత గతంలో ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో అల్లు అర్జున్ సరసన నటించింది. ఇందులో ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ పెయిర్ మరోసారి రిపీట్ అవుతున్న క్రమంలో అభిమానులలో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. సమంతతో పాటు మరో హీరోయిన్ ఈ చిత్రంలో నటించనుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.