తమిళ నవమన్మధుడు అరవింద్ స్వామి కోర్టు మెట్లెక్కాడు. తాను నటించిన చదురంగవేట్టై 2 చిత్రానికి గాను చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ. 1.79 కోట్ల బాకీ ఉందని, ఇంత వరకు ఆ మొత్తం చెల్లించకపోవడంతో చిత్ర నిర్మాత మనోబాలాపై హైకోర్టులో పిటీషన్ వేశారు అరవింద్ స్వామి. పిటీషన్లో ఏడాదికి 18 శాతం వడ్డీతో సహా చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. తాజాగా ఈ ఉదంతంపై విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ నెల 20న నిర్మాత మనోబాల కోర్టుకి వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ‘చదురంగవేట్టై-2’ సినిమాలో హీరోయిన్ త్రిషతో కలిసి అరవింద స్వామి నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎన్వీ నిర్మల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే హీరో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వలన నిర్మాతకి నష్టాలని మిగల్చడం కామన్గా చూస్తుంటాం. కాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది. సినిమా మొత్తం చేసిన తర్వాత తన బాకీ చెల్లించకపోవడంతో ఒక నిర్మాతపై అరవింద్ స్వామి కోర్టుని ఆశ్రయించడం హాట్ టాపిక్గా మారింది. అరవింద్ స్వామి ఆ మధ్య ధృవ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం మణిరత్నం చేస్తున్న మల్టీ స్టారర్ లో నటిస్తున్నాడు. నవాబ్ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో అతి త్వరలోనే ప్రేక్షకులని అలరించనున్నాడు.