నయనతార నటించిన ‘అరం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గోపి నయినార్. ఆయన తదుపరి సినిమాపై ఆసక్తి నెలకొంది. సామాజిక స్పృహతో సినిమాను రూపొందించే దర్శకుల్లో ఒకరిగా గోపి మారారన్న ముద్ర కూడా పడింది. ఈ నేపథ్యంలో తదుపరి చిత్రాన్ని ‘జై’ హీరోగా తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఐశ్వర్యా రాజేష్ కథానాయిక. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. వీజీ చంద్రశేఖర్, సంగిలి మురుగన్, పీఎల్ తేనప్పన్, ఆర్ఎన్ఆర్ మనోహర్లు నటిస్తున్నారు. ప్రసాద్ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తేనీ ఈశ్వర్ సినిమాటో గ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. సినిమాసిటీ ప్రొడక్షన్స్ బ్యానరుపై గంగాధరన్, ఓఎక్స్ ప్రొడక్షన్స్ బ్యానరుపై ఎస్పీ విజయ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా గోపి నయినార్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు. బయటి ప్రాంతాలవారు తమిళనాడును ఎలా ఇబ్బందిపాలు చేస్తున్నారన్నదే కథ. తమిళులు ఎలా తమ ఉనికిని కోల్పోతున్నారనే విషయాన్ని ఇందులో ప్రస్తావించాం. జై ఇందులో ఓ క్రీడాకారుడిగా నటిస్తున్నారు. చెన్నై, చుట్టుపక్కల ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపనున్నామని’ పేర్కొన్నారు.