2019 జనవరిలో రిపబ్లిక్ డే కానుకగా `మణికర్ణిక` చిత్రాన్ని రిలీజ్ చేస్తామని కంగన టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వారియర్ క్వీన్ ఝాన్సీ రాణి పాత్రలో కంగన తడాఖా చూపించనుంది. ఈ పాత్ర కోసం ఎంతో రిస్క్ చేసి కత్తి యుద్ధాలు గుర్రపు స్వారీ వంటి విద్యల్ని నేర్చుకుంది. షూటింగ్ జరిగేప్పుడు జరిగిన ఓ ప్రమాదం వల్ల దాదాపు ప్రాణాలు పోగొట్టుకునే వరకూ వెళ్లింది. ఒకానొక దశలో ఆన్ లొకేషన్ జరిగిన ఓ ప్రమాదం నుంచి బయటపడి అదృష్టవశాత్తూ కంగన బతికి బట్ట కట్టిందన్న వార్తలు వచ్చాయి. ఇంతా జరిగాక.. ఇక చిత్రీకరణ ముగుస్తోంది అనగానే అసలు కథ మొదలైంది. దర్శకుడు క్రిష్తో కంగన వివాదం ముదిరిపాకాన పడింది. దీంతో క్రిష్ మధ్యలోనే ఆ ప్రాజెక్టును వదిలేసి హైదరాబాద్కి వచ్చేశారు. ఇక్కడ బాలకృష్ణ నిర్మిస్తున్న `ఎన్టీఆర్` బయోపిక్తో బిజీ అయిపోయారు. ఆ క్రమంలోనే కంగన నిర్మాతలతోనూ విభేధించిందని సోనూ సూద్తోనూ గొడవ పెట్టుకుందని ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో వివాదాలపై ఆసక్తికర చర్చ సాగింది.