ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాత్ర ఏదైనా అందులో ఒదిగి నటించడమే

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 16, 2018, 11:36 AM



ఆమె బాలీవుడ్ కలల రాణి. అందం, అభినయంతో ఒకనాటి కుర్రకారును కట్టిపడేసిన సొగసరి. పాత్ర ఏదైనా అందులో ఒదిగి నటించడమే తెలుసు. గ్లామర్ ప్లస్ పర్ఫామెన్స్‌తో  క్లాస్ మాస్ తేడా లేకుండా అందరి ప్రశంసలందుకున్న అభినేత్రి. నటిగానే కాకుండా క్లాసికల్ డాన్సర్‌గా, దర్శకురాలిగా, నిర్మాతగా రాణించి... భారతీయ చిత్రసీమలో తనకంటూ స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఆమె ప్రముఖ నటి... హేమమాలిని.


హేమమాలిని... నిండైన రూపం. ఆకట్టుకునే చక్కని రూపం. కాలంతో పాటు తరగని అందం.. ఆమె సొంతం. 1948 అక్టోబర్ 16న చెన్నైలో పుట్టిన హేమమాలిని బాలీవుడ్ డ్రీమ్ గాళ్‌గా గుర్తింపు పొందారు. ఎన్నో విలక్షణ పాత్రలకు తన యాక్టింగ్‌తో జీవం పోసింది హేమమాలిని. సౌత్ నుంచి, నార్త్ వెళ్లి... స్టార్ డమ్ సంపాదించిన అతికొద్ది మంది నటీమణుల్లో హేమమాలిని ఒకరు.


 


కెరీర్ మొదట్లో హీరోయిన్‌గా పనికిరాదన్న వారి నోళ్లు... మూయించింది హేమమాలిని. తన నటనతో విమర్శకులకు ధీటుగా సమాధానమిచ్చింది. నటిగా ఆమె కెరీర్  తెలుగు సినిమాతో  మొదలైందని చాలామందికి తెలీదు. కెరీర్ తొలినాళ్లలో ‘పాండవ వనవాసం’, ‘శ్రీకృష్ణ విజయం’ లాంటి  సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో డాన్స్ చేసి మెప్పించింది హేమామాలిని


 


1971... హేమమాలినికి గోల్డెన్ ఇయర్. ఈ ఏడాది ఆమె నటించిన ‘అందాజ్’, ‘లాల్ పత్తర్’, ‘సీతా ఔర్ గీతా’.. ఒక దాన్ని మించి ఒకటి సూపర్ హిట్ సాధించాయి. ‘లాల్ పత్తర్’లో నెగిటివ్ రోల్లో అద్భుతంగా నటించి మెప్పించింది. ‘అందాజ్’లో యంగ్ విడోగా ఆమె అభినయం.. విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇక ‘సీతా ఔర్ గీతా’లో హేమామాలిని అభినయం పతాకస్థాయికి చేరింది.


 


‘సీతా ఔర్ గీతా’లో మొదటి సారి డ్యూయల్ రోల్లో నటించి మెప్పించింది. రెండు పాత్రలను ఎంతో సమర్థంగా పోషించి క్లాస్, మాస్ ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాకు తొలిసారి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అందుకుంది. ఈ సినిమాల సక్సెస్‌తో అభిమానులు ఆమెను డ్రీమ్ గాళ్‌గా పిలవడం మొదలుపెట్టారు.ఈ సినిమాల తర్వాత హేమమాలిని నటించిన ‘సన్యాసి’, ‘ధర్మాత్మ’, ‘ప్రతిజ్ఞ’, ‘షోలే’ చిత్రాలు... బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ఇక హేమా నటిస్తే, ఆ సినిమా సక్సెస్... అనేంతగా పేరు సంపాదించింది. ఒకే సమయంలో విడుదలైన ‘షోలే’, ‘ధర్మాత్మ’లో రెండు కేరెక్టర్లు డిఫరెంట్. ఆ పాత్రలను సమర్థంగా పోషించి.. సినిమాల సక్సెస్‌లో కీరోల్ పోషించింది హేమమాలిని.


 


హేమామాలిని కెరీర్లోనే కాదు... ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లాండ్ మార్క్‌గా నిలిచిన మూవీ ‘షోలే’. ఈ సినిమాలో అల్లరి పిల్ల బసంతిగా హేమా నటన, ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఈ మూవీలో ధర్మేంద్ర, హేమమాలినిల మధ్య సన్నివేశాలు ఆడియన్స్ ను అలరించాయి. దీంతో హేమమాలిని బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్’గా ఎదిగింది.


 


ఇటు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే.. పారలల్ మూవీస్‌లోనూ యాక్ట్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది హేమమాలిని. వెండితెరపైనే కాకుండా.. బుల్లితెరపై కూడా మెరుపులు మెరిపించింది. పదహారేళ్ల క్రితం భారతీయ సంస్కృతి, సంగీతం, నృత్యం నేపథ్యంగా తీసిన ‘నుపూర్’ సీరియల్ ప్రేక్షకుల్ని అలరించింది. ఆ తర్వాత ‘రిహాయి’, ‘జమాయి రాజా’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ నటిగానూ మెప్పించింది హేమామాలిని. ఈ సినిమాల తర్వాత అడపాదడపా కొన్ని చిత్రాల్లో నటించి మెప్పిస్తూనే ఉంది. అమితాబ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో నటించిన ‘బాగ్‌బన్’, ‘బుడ్డా హోగా తేరా బాప్’ చిత్రాలు నటిగా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com