'#మీటూ' ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తనుశ్రీదత్తా మొదలెట్టిన ఈ రచ్చ, ఇప్పుడు కేవలం సినిమా రంగానికి పరిమితం కాకుండా మీడియా, రాజకీయ రంగాల నుంచి క్రికెట్ దాకా వ్యాపించింది. సాక్ష్యాత్తూ బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీపై కూడా '#మీటూ' ఆరోపణలు వచ్చాయి.ఇక, శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ, సీనియర్ పేసర్ లసిత్ మలింగాల ద్వారా లైంగిక వేధింపులను ఎదుర్కొన్న బాధిత మహిళలు వాటి గురించి వెల్లడించారు. మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాల గుప్తా కూడా '#మీటూ' అంటూ తాను ఎదుర్కొన్న మానసిక వేధింపుల గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే.
‘#మీటూ' పేరుతో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను బహిరంగంగా వెల్లడించడానికి ఒక్కొక్కరుగా ముందుకొస్తున్న విషయం తెలిసిందే. ఇలా నిర్భయంగా బయటికొచ్చి తమ అనుభవాలను పంచుకుంటున్న వారికి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన మద్దతుని తెలియజేసింది. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మహిళల వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ కూడా చేరింది.ఈ సందర్భంగా మిథాలీ రాజ్ మాట్లాడుతూ "'#మీటూ' ఉద్యమానికి నేను మద్దతు ఇస్తున్నా. పనిచేసే చోట భద్రత కోరుకోవడం మహిళల హక్కు. దేనికైనా అంగీకారం అనేది చాలా ముఖ్యం. దాన్ని చాలామంది ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఇష్టం లేకుండా చెయ్యివేసినా పర్లేదులే... అనుకుంటారు. ఇలా లైంగికంగా ఎవరైనా వేధింపులు ఎదుర్కొంటే... వాళ్లు కచ్ఛితంగా పోరాటం చేయాలి" అని అన్నారు.
"ఎదుటివారు ఏమనుకుంటారో అనే దానితో సంబంధం లేకుండా ప్రతిఘటించాలి. అలా పోరాటం చేసేవాళ్లు ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లు ఎదుర్కొన ఇబ్బందులు నిజమైతే, చివరికి వారికే విజయం దక్కి తీరుతుంది. ఆత్మాభిమానం, హుందాతనం ఉన్న మహిళలకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది. నిక్కచ్చిగా ఉండండి, ధైర్యంగా మాట్లాడండి" అంటూ మిథాలీ మీటూ ఉద్యమానికి మద్దతు తెలిపారు.