ఐదేళ్ల వయసులో లైంగిక వేధింపులు ఎదుర్కొని, 14 ఏళ్లకు అత్యాచారానికి గురైన బాధితురాలిగా.. ‘మీటూ’ ఉద్యమంలో పాల్గొని, మాట్లాడుతున్న మహిళలకు సెల్యూట్ చేస్తున్నానని నటి సోమీ అలీ తెలిపింది. ఇలా చేయడం చాలా కష్టమని నాకు తెలుసు.. నాకు కూడా మాట్లాడటానికి చాలా ఏళ్లు పట్టింది. ఇలాంటి విషయాల్ని ప్రపంచానికి తెలియజేయడానికి చాలా ధైర్యం కావాలి. మనవాళ్లకు ఇవి చెప్పినా.. వారు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారే కానీ, ఏం చేయలేని పరిస్థితి. అది ఓ నరకంలా ఉంటుంది. బాధితులు ఈ విషయాల్ని తెలుసుకోవాలి.. మిమ్మల్ని నమ్మని వారి కోసం ఆగకండి. ఇది మీ నిజం. మాట్లాడటానికి భయపడకండి. ఈ అవకాశాన్ని పొగొట్టుకోకండి. మన కోసం ఎప్పుడో రావాల్సిన ఉద్యమం ఇది. మీకు జరిగిన సంఘటనల్ని వినిపించి.. న్యాయం పొందే అవకాశం ఇది. మీపై నాకు నమ్మకం ఉందని చెప్పింది. అనంతరం బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ‘‘మీటూ’ బాధితులకు కృతజ్ఞతలు. దక్షిణాసియాలో ఈ ఉద్యమానికి తెరలేపిన తనుశ్రీకి ప్రత్యేక ధన్యవాదాలు’ అని ఆమె అన్నారు. ‘మహిళ వద్దంటే.. దానర్థం వద్దనే’ అని చెప్పింది.