ప్రవాహంలో ఎప్పటికప్పుడు కొత్తనీరు వచ్చి చేరడం అత్యంత సహజం. అలానే చిత్ర పరిశ్రమలో మారిన ట్రెండ్లో కోకొల్లల నూతన నటీనటులు ప్రవేశించడం చూస్తున్నదే. అంతేకాదు ఒక చిత్ర పరిశ్రమలో తన టాలెంట్ను చాటుకున్న భామలకు ఇంకో చిత్ర పరిశ్రమలో అవకాశాలు లభించడం ఇంకా తేలికే అవుతుందని అంటారు.
ఇందుకు ఎందరో తారలను ఉదహరణగా పేర్కొంటారు కూడా. కన్నడంలో ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన శ్రద్ధ శ్రీనాథ్ కూడా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైందని అంటున్నారు. దాదాపు రెండేళ్ల క్రితం కన్నడంలో రూపొందిన యూ టర్న్ చిత్రం ఆమె కెరీర్ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. అప్పట్నుంచి వెనుదిరిగి చూసుకునే అవకాశమే లేకుండా పలు తమిళ, కన్నడ సినిమాల్లో ఆమెను అవకాశాలు వెదుక్కంటూ వచ్చాయి. ఇదిలావుండగా…ఇటీవల శ్రద్ధ శ్రీనాథ్ పోషించిన పాత్రనే తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అయిన యూ టర్న్ చిత్రంలో ప్రముఖ నటి సమంత పోషించింది. ఆ సందర్భంగా శ్రద్ధ శ్రీనాథ్ నటనను కూడా సమంత ప్రశంసించడం విశేషం, ఇక చాలామంది భామల కోవలోనే శ్రద్ధ శ్రీనాథ్ కూడా తెలుగు సినీరంగంలో తానేంటో చాటుకోవాలని ఉవ్విళ్లూరుతోందట. నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందబోయే జెర్సి చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ్ను ప్రధాన కథానాయికగా తీసుకున్నారని, రెండో కథానాయికగా రెబా మోనికా జాన్ను ఎంపిక చేశారని అంటున్నారు. తనదైన అందం, అభినయాలతో తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో మురిపించి…మున్ముందు శ్రద్ధ ఎంత బిజీ అవుతుందో కాలమే సమాధానమిస్తుంది.