వజ్రాల వ్యాపారి కిడ్నాప్, హత్య కేసులో ప్రముఖ టీవీ సీరియల్ నటి దేవలీన భట్టాచార్జీని పోలీసులు అరెస్టు చేశారు. ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ అనే హిందీ డబ్బింగ్ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన దేవలీన, హిందీలో పలు సీరియళ్లలో నటిస్తోంది. ఈ కేసులో పోలీసులు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు.
ఘాట్కోపర్కు చెందిన రాజేశ్వర్ ఎడాని అనే వజ్రాల వ్యాపారి నవంబర్ 28 నుంచి కనిపించకుండాపోయాడు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాలింపుల్లో భాగంగా పోలీసులు రెండు రోజుల కిందట రాయ్గఢ్ జిల్లాలోని పన్వేల్ అటవీ ప్రాంతంలో కుళ్లిన మృతదేహాన్ని కనుగొన్నారు. అది రాజేశ్వర్దేనని పోలీసులు గుర్తించారు.
రాజేశ్వర్ కాల్డేటాను పరిశీలించగా ఆయన సినీ, టీవీ ఇండస్ట్రీకి చెందిన పలువురిని తరచుగా కలిసేవాడని తేలింది. మహారాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వద్ద గతంలో పనిచేసిన సచిన్ పవార్ అనే వ్యక్తి ద్వారా రాజేశ్వర్ మహిళలను కలిసేవాడని తెలిసింది. దీంతో పోలీసులు సచిన్ పవార్ను అదుపులోకి తీసుకుని విచారించగా దినేష్ పవార్ అనే సస్పెండైన పోలీసు కానిస్టేబుల్ను కూడా అరెస్టు చేశారు. వీరి సమాచారంతో నటి దేవలీనాను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ కేసుతో ఆమె సంబంధం ఏమిటనేది పోలీసులు ఇంకా వెల్లడించలేదు.