ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిరికి పందల చర్యగా వర్ణించిన టాలీవుడ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 15, 2019, 07:07 PM



జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడి పట్ల దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉగ్రవాద సంస్థలను పెంచిపోషిస్తోన్న పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహుతి దాడిలో వీరమరణం పొందిన జవాన్ల పట్ల యావత్తు భారత జాతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
పుల్వామా ఉగ్రదాడిపై టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందించారు. అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్, నిఖిల్ సిద్ధార్థ్, కోన వెంకట్, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి తదితరులు ట్విట్టర్ ద్వారా జవాన్ల మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ బాధను వర్ణించడానికి మాటలు సరిపోవని, వీరజవానుల త్యాగాలు ఊరికేపోవని అంటున్నారు. ప్రతి సైనికుడి త్యాగం దేశ ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఇది పిరికిపందల చర్య అని, దమ్ముంటే ఇండియాను ముఖాముఖి ఢీకొనాలని జైషే మొహమ్మద్ సంస్థకు అల్లు శిరీష్ సవాల్ విసిరారు. దీనికి బాధ్యులైన వారిని కచ్చితంగా చంపాల్సిందేనని మంచు మనోజ్ డిమాండ్ చేశారు. కాగా, పుల్వామా ఆత్మహుతి దాడిలో  జవాన్లు వీర మరణం పొందినట్లు సీఆర్పీఎఫ్ అధికారికంగా ప్రకటించింది. వారి వివరాలను కూడా విడుదల చేసింది. వీరమరణం పొందిన జవాన్లలో ఉత్తర ప్రదేశ్ నుంచి అత్యధికంగా 12 మంది ఉన్నారు. ఆ తరవాత రాజస్థాన్ నుంచి ఐదుగురు, పంజాబ్ నుంచి నలుగురు జవాన్లు అమరులయ్యారు. బిహార్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున జవాన్లు వీరమరణం పొందారు. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, అస్సాం నుంచి ఒక్కో జవాన్ అమరులయ్యారు. అయితే అనధికారికంగా వీరమరణం పొందిన జవానుల సంఖ్య 45కు పైగా ఉందని అంటున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com