అర్జున్ రెడ్డి చిత్రంతో దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన నటుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న విజయ్ కేవలం తన నటనతోనే కాదు సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఆపదలో ఉన్న వారికి తోచినంత సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్న విజయ్ జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం చెందిన సైనిక కుటుంబాలకి అండగా నిలిచాడు. తన వంతు సాయాన్ని అందించి పెద్ద మనసు చాటుకున్నాడు. తన ట్విట్టర్లో ఆర్థిక సాయం అందించిన సర్టిఫికెట్ను షేర్ చేస్తూ.. సైనికులు మన కుటుంబాలని రక్షిస్తున్నారు. ఇప్పుడు వారి కుటుంబాలకి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది. సాయంతో మన సైనికుల జీవితాలని వెలకట్టలేము. కాని మనం మనవంతు సహాకారం అందిద్ధాం. నాకు తోచినంత సాయం నేను చేశాను. మనమందరం కలిసి వారికి ఎంతో కొంత సాయం చేసి మన సపోర్ట్ని అందిద్దాం అని అన్నాడు. విజయ్ బాటలోనే కొందరు అభిమానులు సీఆర్పీఎఫ్కి విరాళాలు పంపిస్తున్నారు. విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఆయన ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.