స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమా తీస్తున్నానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించగానే అందరి కళ్లు దీనిపై పడ్డాయి. వివాదాలకు మారుపేరైన వర్మ కచ్చితంగా దీన్ని కూడా వివాదం చేస్తారని అంతా భావించారు. అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకున్నారు వర్మ. లక్ష్మీపార్వతిని దేవతగా చూపిస్తూ.. చంద్రబాబు నాయుడిని భూతంగా మార్చేశారు. ‘వెన్నపోటు’ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఈ సినిమాపై అందరికీ ఆసక్తి పెరిగిపోయింది.
తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కాకుండా ఎవరూ ఆపలేరని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల ప్రకారం, సెన్సార్ బోర్డు మినహా ఎవరూ సినిమాను ఆపలేరని అన్నారు. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని భావించి, సెన్సార్ బోర్డు అడ్డుకుంటే వారికి సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తెలుగుదేశం వారు డిమాండ్ చేసినట్టుగా సినిమాను ఆపే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. కాగా, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని విలన్ గా చూపిస్తున్నారని, ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.