వంశీ పైడిపల్లి పేరు వినగానే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'బృందావనం' .. 'ఎవడు' .. 'ఊపిరి' సినిమాలు కళ్లముందు కదలాడతాయి. ఆయన తాజా చిత్రంగా థియేటర్లకు వచ్చిన 'మహర్షి' కూడా భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఒకప్పుడు చాలా లావుగా వుండే వంశీ పైడిపల్లి, ఇప్పుడు ఇంతగా సన్నబడటానికి కారణమేమిటనే ప్రశ్న ఆయన ఎదురైంది.
అందుకు ఆయన స్పందిస్తూ .. "మొదటి నుంచి కూడా నేను భోజన ప్రియుడిని. ఏదైనా సరే చాలా ఎక్కువగానే లాగించేస్తుంటాను .. అందువలన బాగా బరువు పెరిగిపోయాను. నా బరువు 120 కేజీల వరకూ వెళ్లిపోయింది .. అదే సమయంలో మా పాప నా దగ్గరికి వచ్చి, 'చాలా లావైపోతున్నావ్ డాడీ' అంది. దాంతో ఇక బరువు తగ్గాలని నిర్ణయించుకుని, అప్పటి నుంచి నెమ్మదిగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. చాలా కసరత్తులు చేసి ఇప్పుడు 83 కేజీలకి వచ్చాను" అని చెప్పుకొచ్చారు.