టీనేజీలోనే సినీ రంగ ప్రవేశం చేసి దశాబ్దంన్నరగా విరామం లేకుండా సినిమాలు చేస్తున్న కథానాయిక పీహెచ్డీ పూర్తి చేయడం ఏంటి అనిపిస్తోందా? అదే చిత్రం మరి. కాజల్ పూర్తి చేసింది అఫీషియల్ పీహెచ్డీ కాదులెండి. తేజ స్కూల్ ఆఫ్ పెర్ఫామింగ్ ఆర్ట్స్లో ఆమె పీహెచ్డీ చదివేసిందట. కాజల్ను 'లక్ష్మీకళ్యాణం' సినిమాతో కథానాయికగా పరిచయం చేసింది తేజనే అన్న సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఆమె వరుసగా అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తేజ దర్శకత్వంలో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా చేసిన ఆమె.. ఇప్పుడు ఆయన డైరెక్షన్లోనే తెరకెక్కిన 'సీత'లో లీడ్ రోల్ చేసింది. తేజ చేతుల మీదుగా పరిచయమైన నేపథ్యంలో తాను 'తేజ స్కూల్ ఆఫ్ పెర్ఫామింగ్ ఆర్ట్స్' నుంచి డిగ్రీ పూర్తి చేశానని గర్వంగా చెప్పుకుంటానని 'సీత' ప్రి రిలీజ్ ఈవెంట్లో కాజల్ కామెంట్ చేసింది.
ఇంతకుముందు నటించిన సినిమాలతో డిగ్రీ చేశానని అనుకుంటే.. ఇప్పుడు 'సీత'లో నటించడం ద్వారా పీహెచ్డీ అందుకున్నట్లు ఉందని కాజల్ వ్యాఖ్యానించడం విశేషం. తనకు తొలి అవకాశం ఇచ్చినందుకు.. ఇప్పుడు తనను నమ్మి సీత లాంటి ప్రత్యేకమైన పాత్రను తనతో చేయించినందుకు తేజకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆమె అంది. ఇక 'సీత' హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ.. అతను చేసిన రామ్ పాత్ర కూడా చాలా ప్రత్యేకమైందని అంది.
తనకు చాలా నచ్చిన కోస్టార్ అని.. వరుసగా రెండు సినిమాల్లో కలిసి నటించడంతో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యామని.. 'సీత'లో ప్రతి సన్నివేశం గురించి తామిద్దరం చర్చించుకుని బెటర్గా పెర్ఫామ్ చేయడానికి ప్రయత్నించామని కాజల్ చెప్పింది. ఈ చిత్రంలో విలన్గా చేసిన సోనూ సూద్.. సినిమాల్లో మాత్రమే నెగెటివ్గా కనిపిస్తాడని.. బయట మాత్రం చాలా పాజిటివ్ పర్సన్ అని కాజల్ కితాబిచ్చింది.