ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ దారుణవైఫల్యం చెందడం తెలిసిందే. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కటే జనసేన ఖాతాలో చేరింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఘోరపరాజయం చవిచూడడం జనసేన పరిస్థితికి నిదర్శనం. దీనిపై, మెగా కుటుంబ సభ్యుడు రామ్ చరణ్ ఫేస్ బుక్ లో స్పందించారు.
"గొప్ప నాయకులు కేవలం నాయకులుగానే మిగిలిపోరు, మార్పు అంటే ఏంటో చూపిస్తారు. ఇది ఓ పాత్రకు సంబంధించిన విషయం కాదు, ఇదంతా ఓ లక్ష్యానికి సంబంధించిన విషయం" అంటూ పోస్టు పెట్టారు. ఈ ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ గారికీ, జనసేన పార్టీకి భేషరతుగా సేవలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.