గుండమ్మకథ.. తెలుగు సినిమా చరిత్రలో మరపురాని, అద్భుతమైన సాంఘిక చిత్రం.. ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన మల్టీ స్టారర్ గుండమ్మకథ విడుదలై 2019 జూన్ 7 నాటికి 57 వసంతాలు పూర్తవుతాయి.. 1962 జూన్ 7న విడుదలైన గుండమ్మకథ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావు, సూర్యకాంతం ప్రధాన పాత్రధారులుగా, విజయా వాహిని స్టూడియోస్ బ్యానర్పై, బి.నాగిరెడ్డి, చక్రపాణిల నిర్మాణ సారథ్యంలో, కమలాకర కామేశ్వర రావు దర్శకత్వంలో రూపొందిన గుండమ్మకథ.. ఆడ పెత్తనంతో అల్లకల్లోమైన ఇంటిని చక్కదిద్దడం అనే పాయింట్ ఆధారంగా రూపొందింది..
మిత్రుని ఇంటి సమస్యను పరిష్కరించడానికి తన కొడుకులిద్దరినీ ఉసిగొలిపే తండ్రిగా ఎస్వీఆర్, ఆయన ఇద్దరు కొడుకులుగా ఎన్టీఆర్, ఏఎన్నార్, వీరికి జంటగా సావిత్రి, జమున, గుండమ్మగా సూర్యకాంతం.. వారి వారి పాత్రల్లో జీవించేసారు.. ఇతర పాత్రల్లో రమణా రెడ్డి, ఛాయాదేవి, హరనాధ్ తదితరులు నటించగా, అల్లు రామలింగయ్య అతిథి పాత్రలో కనిపించారు.. ఈ సినిమాకి చక్రపాణి కథ, డి.వి.నరసరాజు మాటలు, ఘంటసాల సంగీతం, పింగళి పాటలు, మార్కస్ బార్ట్లే కెమెరా పనితనం మూలస్తంభాలుగా నిలిచాయి..
ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ మనవడు నాగ చైతన్యలతో ఈ సినిమాని రీమేక్ చెయ్యాలని ప్రయత్నించారు కానీ, గుండమ్మగా సూర్యకాంతంలా నటించే నటీమణి దొరక్క ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు అంటే.. గుండమ్మగా ఆమె అభినయం ఎంత అద్భుతమో అర్ధమవుతుంది.. ఎన్నేళ్లయినా గుండమ్మకథ తెలుగు సినిమా చరిత్రలో, సినీ ప్రేమికుల, ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి పోతుంది..