భారతదేశంలో ఉన్న విలక్షణ నటుల్లో ప్రకాశ్ రాజ్ ఒకరు. భాషతో సంబంధం లేకుండా ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. దాదాపుగా అన్ని సినిమా ఇండస్ట్రీల నుంచి అవార్డులు అందుకున్నారు. అంతేకాదు, ఆయనలో ఉన్న మరో కోణమే ప్రకాశ్ రాజ్ అంటే ఎవరో సమాజానికి చూపింది. అదే.. ఆయనలోని పొలిటికల్ యాంగిల్. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించే ప్రకాశ్ రాజ్.. ఎన్నో సందర్భాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించారు. ఒకానొక సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీతో సైతం కయ్యానికి కాలు దువ్వారు. అందుకే ఆయనంటే మోదీ ఫాలోవర్స్కు నచ్చదు. దీనికి ఉదాహరణగా పేర్కొంటూ ఇటీవల జరిగిన ఓ ఘటనను ఆయన తన అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్ చర్చనీయాంశం అవుతోంది. కశ్మీర్ పర్యటనలో ప్రకాశ్ రాజ్ ఇటీవల వేసవి విడిది కోసం ప్రకాశ్ రాజ్ కశ్మీర్లో పర్యటించారు. ఆ సమయంలో ఎవరో మహిళ, ఆమె కుమార్తె తనతో ఫొటో దిగేందుకు వచ్చారని, అంతలోనే మోదీ ఫాలోవర్ అయిన ఆమె భర్త వచ్చి నానా యాగి చేశాడని చెప్పారు. ‘‘నేను కాశ్మీర్లోని గుల్మర్గ్లో నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంతలో ఓ మహిళ, ఆమె కూతురు వచ్చి నన్ను సెల్ఫీ అడిగారు. దానికి నేను అంగీకరించాను. దీంతో వారు చాలా సంతోషం వ్యక్తం చేశారు. తల్లి, కూతుళ్లతో ఫొటో దిగితే తల్లి, కూతుళ్లతో ఫోటో దిగిన తర్వాత అసలు గొడవ మొదలైంది. ఇంతలో ఆమె భర్త వచ్చాడు. నా ముందే ఆమెతో గొడవకు దిగాడు. ఆ ఫొటోను డిలీట్ చేయమని రాద్దాంతం చేశాడు. దీనికి కారణం కేవలం నేను ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడడమే. అతడు చేస్తున్న గొడవను చుట్టూ ఉన్న పర్యాటకులు సైతం చూశారు. దీంతో సదరు మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో నేను అతడిని పక్కకు తీసుకెళ్లి సముదాయించాను అని ప్రకాశ్ రాజ్ తెలిపారు. మంచి జీవితాన్ని పంచండి అని నాకో, మోదీకో కాదు.. మీరు ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు, మీ అందమైన కుమార్తెకు జీవితాన్ని పంచండి. మీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకండి. టూర్ను ఎంజాయ్ చేయండి అన్నాను. దీంతో అతడు మాట్లాడకుండా ఉండిపోయాడు. అతడు ఫొటోను డిలీట్ చేయొచ్చు.. చేయకపోవచ్చు.. వాళ్ల మనసును మాత్రం గాయపరిచాడు. దీంతో నేను కూడా బరువైన హృదయంతో అక్కడి నుంచి వచ్చేశాను'' అని జరిగిన దానిని వివరిస్తూ ఆయన ట్వీట్ చేశారు.