సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా శ్రీమంతుడు అని నిరూపించుకున్నాడు. శ్రీమంతుడు చిత్రం తర్వాత మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశాడు. పలు సేవ కార్యక్రమాల్లో మహేష్ పాల్గొంటున్నాడు. తాజాగా మహేష్ సతీమణి నమ్రత ఓ ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
గత మూడేళ్ళ కాలంలో మహేష్ బాబు 1000 మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలని విజయవంతగా చేయించాడు. ఆంధ్ర హాస్పిటల్స్, ఇంగ్లాండ్ కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండషన్ సంస్థల సహకారంతో మహేష్ బాబు ఈ అద్భుత కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు నమ్రత తెలిపింది.
మంచి కార్యక్రమానికి తనవంతు సహకారం అందించిన డాక్టర్ పీవీ రామారావుకు నమ్రత ధన్యవాదాలు తెలిపింది. ఆయన వైద్య బృందం కూడా ఎంతో గొప్పగా సహకరించారని పేర్కొంది. డాక్టర్ రామారావు మాట్లాడుతూ చిన్నారుల గుండె చికిత్సకు మహేష్ బాబు విరాళాలు అందించారని పేర్కొన్నారు. అదే విధంగా శస్త్రచికిత్స తర్వాత అవసరమయ్యే మెడికల్ ఖర్చులని కూడా మహేష్ బాబే చూసుకుంటున్నారని తెలిపారు.