గత కొంత కాలంగా కనిపించకుండా పోయిన దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి తారక ప్రభు ఆచూకీ ఎట్టకేలకు దొరికింది. తన అల్లుడు ప్రభు కనపడటం లేదని వారం రోజుల క్రితం ఆయన మామయ్య సురేంద్రప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తారకప్రభు కోసం పలు చోట్ల వెతికారు. చెన్నై, బెంగళూరులలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందటంతో అక్కడకీచేరుకుని వెతుకులాట మొదలు పెట్టారు. అయితే ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ప్రభు కావాలనే తన మొబైల్ అందుబాటులో లేకుండా చేసి ఉంటాడని, తన పెద్ద భార్య సుశీల, అత్తతో కలిసి వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు అనుమానించారు. అయితే మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్నట్టు స్పష్టమైన సమాచారం అందటంలో ప్రభు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.