హారర్ కామెడీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుండటంతో ఈ తరహా కథల్లో నటించడానికి అగ్రతారలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. రాజుగారి గది-2తో నాగార్జున, సమంత హారర్ కామెడీ బాట పట్టారు. మలయాళ చిత్రం ప్రేతమ్ను స్ఫూర్తిగా తీసుకొని హారర్ కామెడీ కథాంశానికి సందేశం, హీరోయిజం, కుటుంబ బంధాలను జోడించి దర్శకుడు ఓంకార్ ఈ సినిమాను రూపొందించారు. సమస్యలపై పోరాటం చేయాలే తప్ప జీవితాల్ని ముగించుకోవాలనుకోకూడదనే సందేశంతో తెరకెక్కిన చిత్రమిది. ఇప్పుడు రాజుగారి గది 2 చిత్రానికి సీక్వెల్గా రాజుగారి గది 3 తెరకెక్కిస్తున్నాడు ఓంకార్.
బుల్లితెర నుండి వెండితెరకి ఎంట్రీ ఇచ్చిన ఓంకార్ ఈ సారి తమన్నా ప్రధాన పాత్రలో రాజుగారి గది 3 చేస్తున్నాడు. ఈ చిత్రం కొద్ది సేపటి క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న ఈసినిమాలో ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, హరితేజ, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓంకార్ స్వీయ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ రేపటి నుండి జరగనుందని తెలుస్తుంది.బుర్రా సాయి మాధవ్ చిత్రానికి డైలాగ్స్ అందిస్తుండగా, చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్గా పని చేస్తున్నారు.