సాధారణంగా సినిమా విడుదలైన తరువాత అందులో హిట్ డైలాగులు లేదా సీన్లను పేరడీ చేస్తూ వేరొక సినిమాల్లో సరదా సన్నివేశాలు సృష్టించడం మనం చూస్తుంటాం. ఎందుకంటే.. సినిమాలో ఆ డైలాగ్/సీన్ కి వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకోవచ్చనేది దర్శక, నిర్మాతల ఆలోచనగా ఉంటుంది. పైగా..పెద్ద హీరోల డైలాగుల్ని కామెడీ యాక్టర్లు చెబుతుంటే నవ్వుకుంటూ ఎంజాయ్ చేయడం మన ప్రేక్షకులకు సరదా. అయితే, ఇంకా విడుదల కాని సినిమాలోని డైలాగుని.. సీన్ ని పేరడీ చేయడం కాస్త విచిత్రం గానే ఉన్నా అది నిజమే. యువ హీరో ఆది ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా బుర్రకథ. డైమండ్ రత్న బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ను సోమవారం విడుదల చేశారు. ఆది రెండు పాత్రల్నీ.. దానిలో ఉన్న కన్ఫ్యూజన్ ని హాస్యంతో మేళవించి చూపిస్తూనే.. మంచి యాక్షన్ సన్నివేశాల్నీ పరిచయం చేశారు ట్రైలర్ లో. హీరోయిన్ ని, విలన్ ని ఇలా సినిమాలోని అన్ని పాత్రల్ని దాదాపుగా పరిచయం చేశారు. అయితే.. చివర్లో ఇచ్చిన ఓ కిక్ మాత్రం పదేపదే ట్రైలర్ చూడాలనిపించేలా చేస్తుంది. ట్రైలర్ చివర్లో హాస్యనటుడు '30 ఇయర్స్' పృథ్వీ.. 'సాహో' సినిమాలో ప్రభాస్ చెప్పిన 'ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్' డైలాగ్ చెప్పడం హైలైట్గా నిలిచింది. ఆ రకంగా ఈ బుర్రకథ కొత్త ట్రెండ్ ని స్టార్ట్ చేసిందనే చెప్పాలి. జూన్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.