మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ఫ్రాజెక్ ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రం నుంచి అప్డేట్స్ ఆగిపోయి చాలా రోజులు అయింది. బయట నుంచి చాలా రూమర్స్ వినిపించినా మూవీ టీం మాత్రం పెదవి మెదపలేదు. షూటింగ్ ఎంతవరకు వచ్చింది.. ఇంకా ఎన్ని రోజులు సెట్స్ పైనే ఉంటుంది..రిలీజ్ వాయిదా పడుతోందా.. ఇలా ఎన్నో అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతోన్న సమయంలో సైరా షూటింగ్ అయిపోయిందని ఓ గుడ్ న్యూస్ అందింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్న రత్నవేలు ఈ విషయాన్ని ట్వీట్ చేసాడు. సైరా సినిమా షూటింగ్ కోసం రెండేళ్లకు పైగానే కష్టపడ్డామని చెప్పాడు రత్నవేలు.
చిరంజీవి ఇందులో భారతదేశ తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం వయసును కూడా లెక్క చేయకుండా యాక్షన్ స్టంట్స్ చేస్తున్నాడు మెగాస్టార్. తమన్నా, నయనతార, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతిబాబు లాంటి బడా నటులు కూడా ఉన్నారు. ఇక విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
ఇన్నేళ్ల మా కష్టం ఇప్పుడు పూర్తయింది.. కచ్చితంగా కష్టానికి తగిన ఫలితం కూడా వస్తుందని నమ్ముతున్నాం అంటున్నాడు రత్నవేలు . సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు 200 కోట్లతో నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. షూటింగ్ పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్తో బిజీ కానుంది చిత్రయూనిట్. ఇప్పటికే చిరంజీవి డబ్బింగ్ మొదలు పెట్టాడు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగష్టు 22న సైరా ట్రైలర్ విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక అక్టోబర్ 2న తేదీన సినిమా విడుదల చేయనున్నారు.