హీరోయిన్ సమీరా రెడ్డి తన ప్రెగ్నెన్సీని సెలబ్రేట్ చేసుకుంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. బేబీ బంప్ ప్రదర్శిస్తూ ఇటీవల ఆమె అండర్ వాటర్ ఫోటో షూట్ పిక్స్ విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత 9 నెలలుగా సమీరా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. శుక్రవారం ఆమె ముంబైలోని బీమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రసవించారు. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని సమీరా మదర్ మీడియాకు వెల్లడించారు.
సమీరా రెడ్డి-అక్షయ్ వర్దె దంపతులకు ఇది రెండో సంతానం. వారికి ఇప్పటికే హన్స్ వాద్రే అనే మూడేళ్ల కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. సమీరా రెడ్డి తాన గర్భం దాల్చినప్పటి నుంచి బాడీ పాజిటివిటీ పేరుతో తన ప్రెగ్నెన్సీ గురించి వరుస పోస్టులు చేస్తూనే ఉన్నారు. 9వ నెలలోకి ఎంటరైన తర్వాత బికినీలో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.9వ నెలలో నా బేబీ బంప్ బ్యూటీని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. అందుకే ఈ స్పెషల్ ఫోటో షూట్. మరో బిడ్డకు తల్లిని కాబోతున్న విషయం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.
తెలుగు ఫ్యామిలీకి చెందిన సమీరా రెడ్డి ముంబైలో పుట్టి పెరిగింది. మోడలింగ్ రంగం నుంచి సినిమా రంగం వైపు అడుగులు వేసిన ఆమె 2002లో 'మైనే దిల్ తుజ్కో దియా' అనే సినిమా ద్వారా తెరంగ్రేటం చేశారు. 2005లో వచ్చిన మెగాస్టార్ మూవీ 'జై చిరంజీవ' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటరయ్యారు. తర్వాత ఎన్టీఆర్తో కలిసి 'అశోక్' మూవీలో హీరోయిన్గా చేశారు. ఈ రెండు చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వక పోవడంతో టాలీవుడ్లో క్లిక్ కాలేక పోయారు. సౌత్ ఇండస్ట్రీలో సమీరాకు బాగా పేరు తెచ్చిన చిత్రం సూర్య హీరోగా వచ్చిన 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'. ఆమె చివరగా 2013లో సుదీప్ హీరోగా వచ్చిన కన్నడ చిత్రం 'వరదనాయక'లో నటించారు. 2014లో అక్షయ్ వార్దెను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు.