అతిలోకసుందరి శ్రీదేవి మరణించి ఏడాదిన్నర అవుతున్న సమయంలో మళ్లీ కొత్త అనుమానం వ్యక్తం చేశారు కేరళ డీజీపీ (జైళ్లు) రిషిరాజ్ సింగ్. కేరళ కౌముది అనే పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె బాత్ రూమ్లో ప్రమాదవశాత్తు టబ్ లో పడి చనిపోయి ఉండకపోవచ్చని.. ఇందులో అనుమానాలు ఉన్నట్లు రిషిరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. మిత్రుడైన ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉమదతన్, తనకు మధ్య జరిగిన సంభాషణలో ఉమదతన్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అందులో తెలిపారు. అయితే ఈ విషయాన్ని ధృవీకరించేందుకు ఉమదతన్ ఇప్పుడు జీవించిలేరని కూడా స్పష్టం చేశారు ఆ డీజీపీ. శ్రీదేవిది సహజ మరణం అయి ఉండకపోవచ్చని ఉమదతన్ అన్నట్టు రిషిరాజ్ తన కాలమ్ లో తెలిపారు. ఏ వ్యక్తి ఒక అడుగులోతు ఉన్న టబ్ లో మునిగిపోయే అవకాశం లేదన్నారు. ఎవరో రెండు కాళ్లు పట్టుకుని తలను నీటిలో ముంచితే తప్ప ఇలా జరగదని ఆయన అన్నట్లు ఆ పత్రిక స్పష్టం చేయటం విశేషం. ఫిబ్రవరి-24, 2018న దుబాయ్ లోని ఓ హోటల్ లో ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో మునిగి శ్రీదేవి చనిపోయిన విషయం తెలిసిందే. శ్రీదేవిది సహజ మరణమా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే రకరకాల ఊహాగానాలు వచ్చాయి. పోస్టుమార్టం రిపోర్ట్ మాత్రం ఆమెది సహజ మరణమే అని స్పష్టత ఇవ్వడంతో.. ఈ అనుమానాల ఎపిసోడ్కు తెరపడింది. శ్రీదేవి చనిపోయిన ఏడాదిన్నర తరువాత ఇప్పుడు మళ్లీ ఆమె మరణం సహజం కాదంటూ కేరళ డీజీపీ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.