నాయికల కెరీర్ ఎంత పరిమితమో చెప్పేందుకు హెబా పటేల్ తాజా ఉదాహారణ. మూడేళ్ల కిందట పరిశ్రమకు వచ్చిన ఈ నవతార…నాలుగో ఏడు రాకముందే కనుమరుగైంది. కుమారి 21ఎఫ్ ఈ కుమారి తొలి తెలుగు చిత్రం. వచ్చీ రాగానే తన అందాలతో యువత మతి పోగొట్టిందీ భామ. కావాల్సినంత స్వేచ్ఛగా కనిపిస్తూ..చూసిన వాళ్లకు మరో ఆలోచన రాకుండా చేసింది. హెబా చూపించిన ఈ ప్రభావమే ఆమెకు మంచి అవకాశాలు రాకుండా చేసింది. అందానికి మాత్రమే ప్రాధాన్యముండే పాత్రలు, సినిమాలు ఆమెకు దక్కాయి. ఇలా గత రెండేళ్లు బాగానే గడిచినా…ఆ చిత్రాలు కూడా అపజయాలు కావడంతో ఈ నాయికకు అవకాశాలు కరువయ్యాయి. ముఖ్యంగా గత నాలుగు చిత్రాలు మిస్టర్, అంధగాడు, ఏంజెల్, 24 కిస్సెస్ పూర్తిగా నిరాశపర్చాయి. 24 కిస్సెస్ సినిమా హెబా అందాలపై ఆధారపడి రూపొందింది. కథలో రొమాన్స్ చూపిస్తే చూసే ప్రేక్షకులు కేవలం రొమాన్స్ కోసమే సినిమాకు రారన్న విషయం ఈ చిత్రంతో అర్థమైంది. అలా చివరి ఫ్లాప్ చూసేసిన ఈ ముద్దు గుమ్మకు ఇక అవకాశాలే లేకుండా పోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మెరుపులా వచ్చిన అవకాశం భీశ్మ. నితిన్, రశ్మిక మండన్న జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబా ఓ కీలక పాత్రకు ఎంపికైంది. ఇది ఈ నాయికకు గొప్ప అవకాశంగా చెప్పుకుంటున్నారు ఆమె అభిమానులు.