మార్కెట్లో ప్రజాస్వామ్యం చిత్రం ప్రమోషన్లో భాగంగా నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి తన యూనిట్.. శ్రీకాకుళం లోని రామకృష్ణ థియేటర్ కు వచ్చేసారు. ఈ సందర్భంగా స్థానిక పాత్రికేయబృందంతో పాటు వివిధ సంస్ధల ప్రతినిధులు చిత్ర యూనిట్కి స్వాగతం పలికారు. ధియేటర్లో జరిగిన అభినందన సభలో విప్లవాత్మక మార్పు కోసమే ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమా తీశానని సినీనటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. ప్రస్తుత సమాజంలో ఓటుకు నోటు అలవాటైపోయిందని, యువతలో మార్పు వచ్చి మంచి నాయకుడిని ఓటుతో ఎన్నుకుంటే దేశం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే ఉద్దేశ్యంతో ఈ సినిమా తీశానన్నారు. ఎన్నికలలో రాజకీయ నాయకులు ఓట్ల కోసం అభ్యర్థిస్తుంటారని, అయితే గెలిచిన తర్వాత సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తుండడం తనని కలచివేసిందన్నారు. ఈ చిత్రంలో శ్రీకాకుళంకు చెందిన నటి రాజేశ్వరి తెలంగాణ శకుంతలలా అద్భతతంగా నటించారన్నారు.
ఇటీవల కాలంలో దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ వ్యాపారంపై ఆర్ నారాయణ మూర్తి తనదైన శైలిలో సెల్యులాయిడ్పైకి ఎక్కించి సామాన్య జనానికి అర్ధమయ్యేలా చూపారని వక్తలు ప్రసంశించారు. ఇట్లాంటి సందేశాత్మక చిత్రాలు రావాలని కోరుతు, శ్రీకాకుళం జిల్లా కళాకారిణి కేతిరెడ్డి రాజేశ్వరి కి చిత్రంలో అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, తెలిపారు.