లేడీ సూపర్స్టార్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నయనతారకు క్రేజీ ప్రాజెక్టులలో అవకాశాలపై అవకాశాలు వస్తున్నాయే కానీ తగ్గడం లేదు. ఓ వైపు హీరోలకు జోడీగా నటిస్తూనే…మరోవైపు తనపై కథ నడిచే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ ఇప్పట్లో కెరీర్కు ఢోకా లేకుండా చేసుకున్నారు. తమిళంలో ఎక్కువ చిత్రాలు చేస్తున్నా…తెలుగు, మలయాళ భాషల చిత్రాలను వదిలిపెట్టకుండా అడపాదడపా అయినా నటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ సరసన సైరా…నరసింహారెడ్డి చిత్రంలోనూ, తమిళంలో విజయ్ సరసన బిగిల్ చిత్రంలోనూ, మలయాళంలో నివిన్ పౌల్తో కలిసి లవ్ యాక్షన్ డ్రామా అనే చిత్రంలో ఆమె నటిస్తున్నారు. ఇదిలావుండగా….చిరంజీవి, కొరటాల శివ కలయికలో రూపొందబోయే తాజా చిత్రంలోనూ, అల్లు అరవింద్ నిర్మించే రామాయణం చిత్రంలో సీత పాత్ర కోసం నయన్ పేరు వినిపిస్తోంది. ఇంకా మణిరత్నం దర్శకత్వంలో రూపొందబోయే పీరియాడిక్ కథాచిత్రం పొన్నియిన్ సెల్వన్ కోసం ఇప్పటికే విక్రమ్, ఐశ్వర్యరాయ్ తదితరులను ఎంపికచేశారు. తాజాగా ఈ చిత్రం కోసం నయన్ను కూడా సంప్రదిస్తున్నట్లు సమాచారం. కల్కి కృష్ణమూర్తి రాసిన ఈ నవలలో కుందవై పాత్ర కోసం నయన్తో మాట్లాడుతున్నారట. అన్నీ అనుకున్నట్లు కుదిరి నయన్ అంగీకరిస్తే మణిరత్నం కాంబినేషన్లో ఆమెకిదే తొలి సినిమా అవుతుంది. ఇప్పటికే పలు క్రేజీ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఆమె కొత్త ప్రాజెక్టులతో మరింత బిజీ అవుతుందని అంటున్నారు