దర్శకుడు సందీప్రెడ్డి వంగా మాతృమూర్తి వంగా సుజాత (58) బుధవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని రామనాథపురి కాలనీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆమెకు భర్త ప్రభాకర్ రెడ్డి, కుమారులు ప్రణయ్ రెడ్డి, సందీప్ రెడ్డి ఉన్నారు. వంగా ప్రభాకర్ రెడ్డి అడ్తి వ్యాపారం చేస్తారు. ఆయన పెద్ద కుమారుడు ప్రణయ్రెడ్డి అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఆయన రాగానే శుక్రవారం వరంగల్ ఆటోనగర్లోని హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలను నిర్వహిస్తారు. వంగా సుజాత పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు సందీప్రెడ్డికి సానుభూతిని తెలియజేశారు. విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్రెడ్డి’తో తెలుగు చిత్రసీమకు ఎంట్రీ ఇచ్చారు సందీప్రెడ్డి. అదే కథతో ఇటీవల బాలీవుడ్లో ఆయన తెరకెక్కించిన ‘కబీర్ సింగ్’ కూడా ఘన విజయం సాధించింది.