బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ని చూడగానే ఎంతో మంది అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని చూస్తుంటారు. అలాంటిది స్టేజ్పై బిగ్బినే ఓ పెద్దావిడ కాళ్లు మొక్కారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి షోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే.. సింధూతాయ్ సప్కల్. ఆమె ఓ సామాజికవేత్త. దాదాపు వెయ్యి మందికిపైగా అనాథలకు అన్నీ తానై చూసుకుంటోంది. ఇటీవల జరిగిన ఎపిసోడ్లో సింధూతాయ్ పాల్గొన్నారు.
‘నీ కన్నీటి ద్వారా జీవితాన్ని చూడు. ఏడ్చిన తర్వాత నవ్వడం నేర్చుకో. ఎందుకంటే నేను నీకు తల్లిలాంటిదాన్ని. నీతోనే ఉంటాను బేటా’ అంటూ సింధూతాయ్.. బిగ్బి ముందు మరాఠీలో ఓ పద్యం పాడారు. ఆ తర్వాత ఆమె గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్న బిగ్బి సీటు నుంచి లేచి ఆమె పాదాలను నమస్కరించారు. ఈ వీడియో ప్రోమోను అమితాబ్ ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘స్ఫూర్తి, గౌరవంతో..’ అని పేర్కొన్నారు. ఈ ఎపిసోడ్ను త్వరలో ప్రసారం చేయనున్నారు.