సాయిపల్లవి మాసిన బట్టలు వేసుకొని పరకాల బస్టాప్లో అమాయకంగా కూర్చుని బస్ కోసం వెయిట్ చేసింది. తన బస్సురాగానే అక్కడి నుంచి లేచి వెళ్లింది. అయితే ఆమెను ఎవరూ గుర్తుపట్టలేదు. ఈ దృశ్యాలున్న వీడియో లీకైంది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సాయిపల్లవి నటిస్తున్న విరాటపర్వం లోని దృశ్యాలివి. ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సురేశ్ బాబు సమర్పిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. రానా, సాయిపల్లవి, ప్రియమణి, నందితాదాస్, సాయిచంద్, జరీనా వాహెబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మూడు రోజుల షూటింగ్ ఇటీవల వరంగల్, ఘనపురం కోటగుళ్లు, పరకాల పరిసరాల్లో జరిగింది. ఈ నెలాఖరు నుంచి హైదరాబాద్లోనూ, వరంగల్లోనూ కీలక షెడ్యూల్ జరగనుందని సమాచారం.