ఎన్నో అవరోధాలని దాటి, అక్టోబర్ 2న ప్రేక్షకులకి ముందుకు వచ్చేందుకు కొణిదెల ప్రొడక్షన్ అధినేత హీరో రామ్ చరణ్ సిద్ధమైన సైరాని తాజాగా మరో సమస్య చుట్టుముట్టింది. తమకు భారీ ఎత్తున పరిహారం అందిస్తామని చిరంజీవి తమకు న్యాయం చేస్తామని గతంలో హామీ ఇచ్చారని కానీ ప్రస్తుతం తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదంటూ ఉయ్యాలవాడ వంశీ యులు జూబ్లీహిల్స్లోని చిరంజీవి కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు.
సైరా నరసింహారెడ్డి చిత్రానికి కావలసిన సమాచారంతో పాటు , సినిమాకి అవరసరమైన లొకేషన్స్, నరసింహారెడ్డి జీవిత చరిత్రను పూర్తిగా చిత్ర బృందానికి తెలియజేసి, సినిమాకు కావాల్సిన పూర్తి సహకారం అందించిన తమపై పోలీసులతో అరెస్టు చేయించడంపై ఉయ్యల వాడ వంశీయులు భగ్గుమన్నారు. తమ నుంచి సహాయ సహకారాలందుకు షూటింగ్ ను పూర్తి చేసుకొని , సినిమా విడుదల చేసి కోట్లు ఆర్జించాలని చూస్తున్న చిరంజీవి కుటుంబం ఇప్పుడు తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. చిరంజీవి తన హామీని నిలబెట్టుకోకుంటే న్యాయపోరాటానికి కూడా తాము సిద్దమేనని వారు మీడియాకు చెప్పారు.
కాగా తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత నేపథ్యంలో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం సైరా. చిరంజీవి, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు, నయనతార, తమన్నా వంటి స్టార్స్ ఈ చిత్రంలో భాగం కావడంతో సైరా చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి.