‘టచ్ చేసి చూడు’ చిత్రంలో తన నటన చూసి రవితేజ మెచ్చుకున్నారని అంటున్నారు రాశీ ఖన్నా. రవితేజ, రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ సినిమాకు విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించారు. సీరత్ కపూర్ రెండో కథానాయికగా నటించారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి రాశీ ఖన్నా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు.
రవితేజతో కలిసి పనిచేస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఇష్టం. ‘టచ్ చేసి చూడు’లో రవితేజకు నా నటన నచ్చింది. సినిమాకు ఆయన డబ్బింగ్ చెబుతున్నప్పుడు ‘నాకంటే అద్భుతంగా నటించావు’ అని మెసేజ్ పంపారు. ఆయన నుంచి ప్రశంస రావడం నిజంగా గొప్ప విషయమే.’ అని చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో రవితేజ పోలీస్ అధికారి పాత్రలో నటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ప్రస్తుతం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమాకు ‘నేల టికెట్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. మరోపక్క రాశీ ఖన్నా వరుణ్ తేజ్కు జోడీగా ‘తొలిప్రేమ’ సినిమాలో నటిస్తున్నారు.