తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించిన నటుడు పొన్నాంబళం అందరికీ తెలిసిన వాడే. ఈయన ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న పొన్నాంబళం తన పరిస్థితిని వీడియో రూపంలో విడుదల చేసాడు. ఆసుపత్రిలో ఆక్సిజన్ మాస్క్తో ఊపిరి తీసుకుంటున్న పొన్నాంబళం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇది చూసిన వెంటనే లోక నాయకుడు కమల్ హాసన్ స్పందించాడు. పొన్నాంబళం ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడమే కాకుండా ఆయనకు ఆర్థిక సాయం కూడా చేస్తానని మాటిచ్చాడు. తన కుటుంబ సభ్యులతో మాట్లాడి అతడి పిల్లల చదువు బాధ్యత కూడా తీసుకుంటానని హామీ ఇచ్చాడు కమల్ హాసన్. అంతేకాదు తన సిబ్బందిని అక్కడే ఉంచి ఎప్పటికప్పుడు పొన్నాంబళం పరిస్థితి తెలుసుకుంటున్నాడు. మరోవైపు రజినీకాంత్ కూడా పొన్నాంబళంకు ఆర్థిక సాయం అందించడానికి ముందుకొచ్చాడు. స్టంట్ మ్యాన్ అనే చిత్రంతో పరిచయం అయిన పొన్నాంబళం కమల్ హాసన్, రజనీకాంత్ సహా సౌత్ ఇండియన్ స్టార్ హీరోలందరితోనూ నటించాడు.