సినీపరిశ్రమలో బయోపిక్ లు రూపొందడం కొత్తేం కాదు. ఇప్పటి వరకూ ఎంతో మంది సినీ తారలు క్రీడాకారులు రాజకీయ నాయకుల జీవితాలను వెండితెరపై ఆవిష్కరించారు. అయితే.. తొలిసారిగా ఓ ఆధ్యాత్మిక గురువు జీవితం సెల్యూలాయిడ్ పై చెక్కనున్నారు. భారతదేశానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ జీవిత చరిత్రను సినిమాగా తీయబోతున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ ట్వీట్ చేశారు. రవిశంకర్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం ఈ మూవీని అనౌన్స్ చేశారు. ‘‘గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ బయోపిక్ ద్వారా అందరిలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలనేది మా లక్ష్యం. మాంటో బస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు. 100 దేశాల్లో 21 భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చెప్పారు. కొవిడ్ తీవ్రత తగ్గిన తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.